'ఉత్తమ తెలుగు జర్నలిస్టు - 2026' పురస్కార వేడుకలకు ముఖ్య అతిథిగా గోవా గవర్నర్ !
గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులు
'జర్నలిస్టులను గౌరవించడం మాకూ గౌరవమే ' అంటూ వ్యాఖ్య
సూత్రప్రాయంగా అంగీకరించిన గవర్నర్ అశోక్ గజపతిరాజు
వెల్లడించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు
విజయనగరం:
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఉత్తమ తెలుగు జర్నలిస్టులు - 2026’ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఒక విశిష్టత చేకూరనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్ గౌరవనీయులు పూసపాటి అశోక్ గజపతిరాజును సంఘం ప్రతినిధులు కోరారు. సోమవారం విజయనగరంలోని ఆయన నివాసంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, గౌరవ సలహాదారులు, సీనియర్ జర్నలిస్ట్ ఎలిశెట్టి సురేష్ కుమార్ నేతృత్వంలో సంఘం ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగే 'ఉత్తమ తెలుగు జర్నలిస్టు -2026 ' పురస్కారాల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం అందజేశారు. సమాజ శ్రేయస్సు కోసం, వృత్తి ధర్మానికి కట్టుబడి పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు గవర్నర్కు వివరించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులను ఎంపిక చేసి, వారిని గౌరవించుకోవడం ద్వారా జర్నలిజం విలువలను కాపాడుకోవచ్చని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించవచ్చునని ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా సంఘం చేపడుతున్న కార్యక్రమాలు, సామాజిక బాధ్యతతో నిర్వహించే పలు సేవా కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణాళికలను కూడా రంగనాయకులు ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజుకు వివరించారు. సంక్షేమంతో పాటు వృత్తిపరమైన గౌరవం అందించాలని భావించి, గత మూడేళ్లుగా ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు పురస్కారాలు అందిస్తున్నామన్నారు. గతంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా పురస్కారాలు అందించామన్నారు. అలాగే ఈ ఏడాది కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉత్తమ జర్నలిస్టులకు తమరి చేతుల మీదుగా పురస్కారాలు అందించాలని ఆశపడుతున్నామన్నారు. ఈ ఆహ్వానంపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు అయన తెలిపారు. గవర్నర్ అశోక్ గజపతిరాజు సానుకూల స్పందనతో తెలుగు జర్నలిస్టు వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం తెలుగు జర్నలిజం రంగంలో మరో మైలురాయిగా నిలవనుందని ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్టు ఎలిశెట్టి సురేష్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తుందని అన్నారు. ఉత్తమ తెలుగు జర్నలిస్టులు పురస్కారాలు అందించటం మంచి కార్యక్రమాన్ని అటువంటి కార్యక్రమాలకి గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు వంటి గౌరవ వ్యక్తులు హాజరవడం ద్వారా ఈ పురస్కారాలకు ప్రాధాన్యత లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.