అసంపూర్తిగా బొడ్డపుట్టు బ్రిడ్జి – 20 గ్రామాల ప్రజలకు నిత్యకష్టాలు
వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వానికి రేగం చాణక్య డిమాండ్
దివ్య దర్శిని న్యూస్,అల్లూరి జిల్లా,/పెదబయలు, ఏప్రిల్ 26:
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పెదబయలు మండలం కుంతుర్ల గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బొడ్డపుట్టు బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా ఉండటం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య ఆదివారం ఆ ప్రాంతాన్ని సందర్శించి, బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయన దృష్టికి సమస్యలను తీసుకువచ్చారు. బొడ్డపుట్టు బ్రిడ్జి ఈ ప్రాంతానికి కీలక రాకపోక మార్గమని, సుమారు 20 గ్రామపంచాయతీల ప్రజలు ఈ మార్గంపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. అయితే మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ఉద్యోగస్తులు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
ప్రత్యేకంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని, బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై స్పందించిన రేగం చాణక్య, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బొడ్డపుట్టు బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ పెదబయలు మండల పార్టీ అధ్యక్షుడు మజ్జి చంద్రబాబు, అరకు నియోజకవర్గం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సందడి కొండబాబు, జిల్లా యువజన ఉపాధ్యక్షుడు నాగరాజు, మండల బూత్ కమిటీ ఇంచార్జ్ కిముడి చిట్టిబాబు, యువజన విభాగం అధ్యక్షుడు లక్ష్మీనాయుడు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నగేష్, వణుగురు గున్నెరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ప్రాథమిక అవసరమైన రాకపోక సౌకర్యాన్ని అందించడంలో ఆలస్యం జరుగుతుండటంపై స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తుందా అనే దానిపై ప్రజలు ఎదురుచూస్తున్నారు.