జీవీఎంసీలో ఘనంగా అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు
అల్లూరి సీతారామరాజు దేశభక్తి, త్యాగనిరతి యువతకు ఆదర్శప్రాయం
మహానుభావుల సేవలను స్మరించుకోవడం సమాజానికి స్ఫూర్తి దాయకం
జీవీఎంసీ అదనపు కమిషనర్ పీఎం. సత్యవేణి
విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్
స్వాతంత్ర్య సమర యోధులు,మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలతో గురువారం ఘనంగా వర్ధంతి వేడుకను నిర్వహించడమైనదని జీవీఎంసీ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి పేర్కొన్నారు. గురువారం ఆమె అదనపు కమిషనర్లు ఎస్.ఎస్. వర్మ, పి. నల్లనయ్య, ప్రధాన ఇంజనీరు పి.వి. సత్యనారాయణ రాజు, వ్యయ పరిశీలకులు సి. వాసుదేవ రెడ్డి, జోనర్ కమిషనర్ శివప్రసాద్ లతో కలసి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ అదనపు కమిషనర్లు మాట్లాడుతూ నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలను రాష్ట్ర వేడుకలుగా రాష్ట్రమంతటా జరుపుకుంటున్నామని అన్నారు. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య ఉద్యమంలో చూపిన ధైర్యసాహసాలు, త్యాగస్ఫూర్తి భారత యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. స్వేచ్ఛ, సమానత్వం, దేశభక్తి విలువలను సమాజంలో పెంపొందించేందుకు మహానుభావుల జీవిత చరిత్రలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు సేవలను స్మరించుకోవడం ద్వారా యువతలో దేశభక్తి భావనలు మరింత పెంపొందుతాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ బి అరుణకుమారి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి. పద్మజ, పర్యవేక్షకులు శ్రీనివాస్, ఇతర అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.