పూతికపేటలో ఉపాధి మేట్ల తొలగింపు యత్నం తగదు
*ఎంపీడీఓ కార్యాలయం వద్ద వేతనదారులు ఆందోళన
నెల్లిమర్ల, దివ్యదర్శిని న్యూస్;
ఉపాధి హామీ పథకంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న మేట్లను రాజకీయ కారణాలతో తొలగించేందుకు ప్రయత్నించడం అన్యాయమని నిరసిస్తూ మండలంలోని పూతికపేట గ్రామ వేతనదారులు, మేట్లు మంగళవారం ఉవ్వెత్తున ఆందోళన చేపట్టారు. కూటమి నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.మంగళవారం ఉదయం పూతికపేట గ్రామ మాజీ సర్పంచ్ లెంక గోవిందరావు ఆధ్వర్యంలో మేట్లు, పెద్ద సంఖ్యలో వేతనదారులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వం మరియు అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎంపీడీఓ రామకృష్ణ రాజు, ఏపీఓ రామారావులను కలిసి తమ గోడును విన్నవిస్తూ వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతమున్న మేట్ల నుంచి అధికారిక సెల్ ఫోన్లను బలవంతంగా తీసుకుని, అనధికారిక వ్యక్తులతో వేతనదారులకు మస్తర్లు వేయిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. కూటమి నాయకులు తమ అనుచరులను మేట్లుగా నియమించుకోవడానికి, పాతవారిని తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కాలంగా నమ్మకంగా పనిచేస్తున్న మేట్లను ఏ ప్రాతిపదికన తొలగిస్తారని అధికారులను నిలదీశారు. పనిచేసే హక్కును కాలరాయడం సరికాదని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం పేదలు పనిచేసే ఉపాధి హామీ పథకంలో వేలు పెట్టడం దుర్మార్గం. మేట్లను తొలగించే ప్రయత్నాలను విరమించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. లెంక గోవిందరావు హెచ్చరించారు.
ఎంపీడీఓ రామకృష్ణ రాజు స్పందిస్తూ.. నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పూతికపేట గ్రామానికి చెందిన మేట్లు, అత్యధిక సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.