ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య
డీఈఓ పిలుపు
యలమంచిలి, న్యూస్ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) గిడ్డి అప్పారావు నాయుడు కోరారు. యలమంచిలి మండలంలోని రామరాయుడుపాలెంలో నిర్వహించిన 'బడిబాట' కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ఇంటింటికీ తిరిగారు. తీవ్రమైన ఎండను సైతం లెక్కచేయకుండా గ్రామస్థులతో ముచ్చటించి, ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల గురించి వివరించారు. డీఈఓ చొరవతో ప్రభావితమైన తల్లిదండ్రులు వెంటనే ఎనిమిది మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించడం విశేషం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వయంగా ఆదర్శంగా నిలిచారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వేగి రాజుబాబు, ఒక అంగన్వాడీ టీచర్ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని పెంచారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ, విద్యార్థుల సంఖ్య 40 దాటితే ఈ పాఠశాలను 'మోడల్ ప్రైమరీ స్కూల్'గా అభివృద్ధి చేస్తామని, అదనపు ఉపాధ్యాయులను కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 'తల్లికి వందనం' వంటి పథకాలు పేద విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తున్నాయని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నేడు ప్రభుత్వ బడులు ఆధునిక హంగులతో అలరారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సూర్య ప్రకాష్, అరుణ్ కుమార్, పలువురు ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.