ఫిన్లాండ్ అంతర్జాతీయ శిక్షణకు హుకుంపేట ఉపాధ్యాయుడు సత్యరావు ఎంపిక
అంతర్జాతీయ వేదికపై గిరిజన ప్రాంత ఉపాధ్యాయుడి ప్రతిభకు గుర్తింపు
విద్యా రంగంలో నూతన ఆవిష్కరణల అధ్యయనానికి విదేశీ శిక్షణ అవకాశం
అల్లూరి జిల్లా/హుకుంపేట, జూన్ 16:
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమానికి హుకుంపేట మండలం మత్యాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మోష్య సత్యరావు ఎంపిక కావడం స్థానికంగా ఆనందాన్ని కలిగించింది. గిరిజన ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు అంతర్జాతీయ స్థాయి శిక్షణకు ఎంపిక కావడం విద్యా రంగంలో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
విజయవాడలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (IPDP) లో సత్యరావు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఈ శిక్షణ కార్యక్రమం మూడు దశల్లో నిర్వహించబడుతోంది.
మొదటి దశలో విజయవాడలోని శిక్షణా కేంద్రంలో ఫిన్లాండ్లోని తూర్కు విశ్వవిద్యాలయం నిపుణుల ఆధ్వర్యంలో ఆధునిక బోధనా విధానాలు, విద్యార్థి కేంద్రిత అభ్యాస పద్ధతులపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.
రెండో దశలో భాగంగా ఆగస్టు 17 నుంచి 26 వరకు ఎంపికైన ఉపాధ్యాయులు యూరప్లోని విద్యా సంస్థలను సందర్శించి అక్కడి విద్యా వ్యవస్థ, బోధనా ప్రమాణాలు, వినూత్న అభ్యాస విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అనంతరం మూడో దశలో ప్రాజెక్టు అమలు, పాఠశాలల్లో వినూత్న కార్యక్రమాల నిర్వహణకు విదేశీ ప్రొఫెసర్లు ఆన్లైన్ ద్వారా మార్గదర్శకత్వం అందించనున్నారు.
ఈ అరుదైన అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,కు ఉపాధ్యాయుడు సత్యరావు కృతజ్ఞతలు తెలిపారు. శిక్షణ ద్వారా పొందిన అనుభవాన్ని విద్యార్థుల అభ్యాస నైపుణ్యాల పెంపుకు వినియోగిస్తూ, కార్యక్రమ లక్ష్యాల సాధనకు శాతం శాతం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ వి. సతీష్ రెడ్డి, సమగ్ర శిక్ష అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గిరిజన ప్రాంత విద్యకు కొత్త దిశ
హుకుంపేట వంటి గిరిజన ప్రాంతం నుంచి ఒక ఉపాధ్యాయుడు అంతర్జాతీయ శిక్షణకు ఎంపిక కావడం స్థానిక విద్యా వ్యవస్థకు గర్వకారణంగా నిలిచింది. ఈ శిక్షణ ద్వారా ప్రపంచ స్థాయి విద్యా విధానాలను అవగాహన చేసుకుని వాటిని స్థానిక పాఠశాలల్లో అమలు చేయడం ద్వారా విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.