బలహీనవర్గాల పక్షపాతి వంగవీటి మోహనరంగారావు
*బోడే రామచంద్ర యాదవ్
నెల్లిమర్ల, దివ్య దర్శిని న్యూస్:
బడుగు బలహీన వర్గాల, బహుజనుల పక్షపాతి వంగవీటి మోహన రంగారావు అని భారత్ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. మండలంలో సతివాడలో మంగళవారం వంగవీటి ఆశాకిరణ్ తో కలిసి వంగవీటి మోహనరంగారావు విగ్రహావిష్కరణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రంగరావు ఒక కులానికో లేదా ఒక ప్రాంతానికో పరిమితం చేయడం ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడమేనని, ఆయన బలహీన వర్గాలందరి ఆశాకిరణమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్లతో జిల్లాలు ఉన్నప్పుడు.. పేదల పక్షపాతి అయిన వంగవీటి రంగారావు పేరును ఆయన పుట్టిన జిల్లాకు ఎందుకు పెట్టకూడదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు "వంగవీటి" జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థకు భిన్నంగా, తమిళనాడు తరహాలో బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కొత్త రాజకీయ విప్లవం రావాలని ఆకాంక్షించారు.
అణగారిన వర్గాల కోసం ప్రాణత్యాగం చేసిన రంగన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని, రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయ రాజకీయాలే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
"చరిత్రలో కొందరు పదవుల కోసం మిగిలిపోతారు.. కానీ రంగన్న లాంటి వారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు." అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆల్తి రామచంద్రరావు, చందక రామచంద్రరావు, కోరాడ శ్రీనివాసరావు, ఆల్తి నల్లిబాబు, కరుమజ్జి గోవిందరావు, ఎంపీటీసి రెడ్డి సత్యనారాయణ, మాజీ సర్పంచి రేవళ్ల శ్రీనివాసరావు, బీసీవై పార్టీ నాయకులు ఐ శేఖర్ యాదవ్, ఎస్ శ్రీనివాస్, నమ్మి అప్పలరాజు, చనమల్లు ప్రసాదరావు, జి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.