ముఖ్యమంత్రి తర్లువాడ పర్యటనను విజయవంతం చేయండి
*ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
విశాఖపట్టణం, ఏప్రిల్ 24 ః ఈ నెల 28న తర్లువాడలో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్ట్ కిశోర్ సూచించారు. గూగుల్ డేటా సెంటర్ ఏఐ హబ్ కు శంకుస్థాపన చేసేందుకు విచ్చేస్తున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలన్నారు. గూగుల్ ప్రతినిధులతో, అధికార యంత్రాంగం సమన్వయం చేసుకొని పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. సంబంధిత డ్యూటీ అధికారులంతా గూగుల్ డేటా సెంటర్ ప్రాంతాన్ని పరిశీలించాలని, అక్కడి అవసరాలకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సుమారు వెయ్యి మంది కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారని, దానికి తగ్గట్లు పార్కింగ్ వసతి, తాగునీరు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. నిర్ణీత సమయంలోగా హెలిప్యాడ్ ను నిర్మించాలని, తాత్కాలిక రోడ్ పనులను పూర్తి చేయాలని చెప్పారు. దుమ్మూధూళి రేగకుండా నీటిని పిచికారీ చేయాలని, ఫైర్, ఎలక్ట్రికల్ సేఫ్టీ చూసుకోవాలని సూచించారు. డేటా సెంటర్ ప్రాంతానికి చేరుకునే వారికి, పార్కింగ్ చేసుకునే వారికి తెలిసేలా ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రితో పాటు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా వచ్చే అవకాశం ఉన్నందున గ్రీన్ రూమ్ ల ఏర్పాటు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్యూటీ పాసులు, వెహికల్ పాసుల గురించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని జేసీకి సూచించారు.