సూర్యఘర్ పథకం అమలులో ఏపీ నెంబర్ వన్ కావాలి: గంటా
భీమిలి, ఏప్రిల్ 15: పీఎం సూర్యఘర్ దరఖాస్తులలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సోలార్ ప్యానెల్స్ ఇన్ స్టాలేషన్ లో కూడా అదే స్ఫూర్తి కొనసాగించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జేవీ అగ్రహారంలో మంగళవారం జరిగిన పీఎం ఎస్సీ, ఎస్టీ సూర్యఘర్ యోజన ఉత్సవ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో 66.48 లక్షల మంది ప్రజలు సూర్యఘర్ పథకం కావాలని దరఖాస్తు చేసుకోగా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా 14.72 లక్షల మంది ఉన్నారన్నారు. అయితే అందులో కనీసం 10 శాతం మంది కూడా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఇన్ స్టాల్ చేసుకోకపోవడం విచారకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, పార్టీ శ్రేణులు కలిసి ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ఇన్ స్టాలేషన్ లో ప్రస్తుతమున్న 6 వ స్థానం నుంచి ఆంధ్రప్రదేశ్ ను మొదటి స్థానానికి చేర్చాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రంలో సోలార్ ప్యానెల్స్ ఉచితంగా ఇస్తున్నామని, అదనపు విద్యుత్ అమ్మకం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ప్రజల మన్ననలు పొందుతున్నామన్నారు. ఈపీడీసీఎల్ ఈఈ సింహాచలం నాయుడు, జోనల్ కమిషనర్ ఎం. విజయ్ కుమార్, ఎమ్మార్వో పి.రామారావు, జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, గంటా నూకరాజు, తాట్రాజు అప్పారావు, గరికిన ఎల్లాజీ (కింగ్), పాసి త్రినాథ్, మన్యాల సోంబాబు, గొలగాని నరేంద్ర, తమ్మిన సూరిబాబు, కె.రామానాయుడు, చెట్టుపల్లి గోపీ, జీరు సత్యం, కానూరు అచ్యుతరావు, గరే గుర్నాథ్, నాగోతి సత్యనారాయణ, చెట్టుపల్లి సన్యాసిరావు, బోయి శ్రీను తదితరులు పాల్గొన్నారు.