ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం
* మే 15న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
* వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కిల్లంపల్లి రామారావు
నెల్లిమర్ల, దివ్య దర్శిని న్యూస్:
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉపాధి హామీ చట్టం వేతనదారుల మనుగడకే ముప్పుగా పరిణమించాయని, దీనికి నిరసనగా ఈ నెల 15న జరిగే దేశవ్యాప్త సమ్మెను ఉపాధి కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కిల్లంపల్లి రామారావు పిలుపునిచ్చారు.
బుధవారం కొండగుంపాంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లిన ఆయన నూతన చట్టం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. 'వికసిత్ భారత్ - గ్రామీణ ఉపాధి, జీవనోపాధుల' పేరుతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం ఉపాధి హామీని నిర్వీర్యం చేసేలా ఉంది. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏటా కనీసం 200 రోజుల పని కల్పించేలా చూడాలని చెప్పారు.
పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా రోజువారీ కనీస వేతనాన్ని రూ. 700లకు పెంచాలని కోరారు. ముఖ గుర్తింపు వంటి వివక్షాపూరిత హాజరు పద్ధతులను, చెల్లింపుల్లో జాప్యాన్ని కలిగించే నిబంధనలను ఎత్తివేయాలన్నారు. ఉపాధి పనుల ప్రణాళిక మరియు అమలులో గ్రామసభలకు పూర్తిస్థాయి అధికారాలు కల్పించాలని చెప్పారు.