12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు... అరెస్ట్
* ఇంచార్జ్ డిఎస్పి ఎస్. రాఘవులు వెల్లడి
విజయనగరం,దివ్య దర్శిని న్యూస్:
విజయనగరం పట్టణంలో చోటు చేసుకున్న ఓ విషాద ఘటన. ఒక మైనరు బాలికపై అత్యాచారానికి పాల్పడిన విజయనగరం పట్టణానికి చెందిన రాజేటి సత్యారావు (53)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఎస్.రాఘవులు వివరాలు వెల్లడించారు. విజయనగరం పట్టణంలో ఉంటున్న మైనరు బాలిక (12) వేసవి సెలవులు కావడంతో తన అమ్మమ్మ పాల వ్యాపారంలో సహాయం చేస్తూ ఆదివారం ఉదయం నిందితుడు విజయనగరం పట్టణానికి చెందిన రాజేటి సత్యారావు ఇంటికి పాలు పొయ్యడానికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో నిందితుడు తప్పా ఎవరూ లేరు. అదును చూసి పాలు పొయ్యడానికి వచ్చిన ఆ మైనరు బాలికను పాలు డబ్బులు ఇస్తానని చెప్పి లోపలికి పిలిచి, ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించాడు. అనంతరం ఆ బాలిక ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకోనుచుండగా బాలిక తల్లి ఒంటి మీద గాయాలను చూసి, ఏం జరిగిందని అడగగా, ఆ బాలిక జరిగిన విషయం తల్లితో చెప్పింది. వెంటనే బాలిక తల్లి విజయనగరం మహిళా పోలీస్ స్టేషనుకు వచ్చి ఫిర్యాదు చేశారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి.శిరీష పోక్సో కేసు నమోదు చేసారు. వెంటనే మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ఈ. నరసింహమూర్తి కేసు దర్యాప్తును ప్రారంభించారు. కేసు విచారణలో భాగంగా నిందితుడు విజయనగరం పట్టణం బిసి కాలనీకి చెందిన రాజేటి సత్యారావును బుధవారం పోలీసు అరెస్ట్ చేసారు. వెంటనే రిమాండుకు కూడా తరలించనున్నట్లు విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఎస్.రాఘవులు తెలిపారు. చిన్న పిల్లలు, మహిళలపై ఎవరైనా అఘాయిత్యాలకు, లేదా దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, ఈ తరహా కేసులను తీవ్రంగా పరిగణించి, న్యాయస్థానాల్లో త్వరితగతిన శిక్షి పడేలా చర్యలు చేపడతామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా దర్యాప్తు పూర్తి చేసి, కేసు త్వరలో ట్రయల్ పూర్తయ్యే విధంగాను, నిందితడు కఠినంగా శిక్షింపబడే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో చాలా పోక్సో కేసులలో నిందితులకు జైలు శిక్షలు పడి జైలులో మగ్గుతున్నారని తెలిపారు. మీడియా సమావేశంలో విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ఈ.నరసింహమూర్తి, ఎస్ఐ జి.శిరీష, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.